"హత్యకు ముందు ఆ తర్వాత"... రిమాండ్​ రిపోర్టులో ఏముందంటే..
lawyer-vaman

తెలంగాణలో.. న్యాయవాదులు వామన్‌రావు దంపతులను అనుసరించి వచ్చిన నిందితులు కొద్దినిమిషాల్లోనే నడిరోడ్డు మీద వారిద్దరినీ ఘోరంగా నరికి చంపి... ఏమీ జరగనట్లే అక్కడి నుంచి జారుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా వెల్లడైంది. ఆ రాత్రికి కారులోనే ప్రశాంతంగా నిద్రపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి వారు మంథనిలో న్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయి.

తెలంగాణలో.. తీవ్ర సంచలనం సృష్టించిన వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. కల్వచర్ల సమీపంలో వామన్‌రావు, నాగమణిలను హత్య చేసిన అనంతరం నిందితులు నేరుగా కారులో సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు రక్తసిక్తమైన తమ దుస్తులను బ్యారేజీలో పడేశారు. బ్యారేజీ నుంచి కారులో వాంకిడి చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ఆ రాత్రికి నిందితులు వాహనంలోనే పడుకున్నారు. ప్రస్తుత రిమాండ్‌ రిపోర్టును బట్టి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని తెలుస్తోంది. ఈ మొత్తం కేసులో బిట్టు శ్రీను పాత్ర ఏమిటి అనేది అతడికి సంబంధించిన రిమాండ్‌ డైరీ ద్వారా వెల్లడయ్యే అవకాశముంది.

ఎప్పటి నుంచో...

కుంట శ్రీనుపై కేసులు, ఫిర్యాదుల గురించి వామన్‌రావు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. కుంట శ్రీను దీనిపై ఫోన్‌లో బెదిరించడం వల్ల... వామన్‌రావు అతడిపై హైదరాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు. మంథని ఠాణాలోనూ కుంట శ్రీనుపై పదుల సంఖ్యలో ఫిర్యాదులుచేశారు. శ్రీను... గుంజపడుగు బస్టాండ్‌ వద్ద స్థలాన్ని కొని భవనం, సమీపంలోనే గుడిని నిర్మిస్తున్నాడు. దీనితో పాటు రాధాగోపాలస్వామి ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయగా.. వీటన్నింటినీ అడ్డుకునేందుకు వామన్‌రావు కేసులు వేయడం వల్ల శ్రీనుకు అతడికి మధ్య వివాదం ముదిరింది. వామన్‌రావు విషయమై కుంట శ్రీను పలుమార్లు బిట్టు శ్రీనుతో చర్చించి చివరకు ఎలాగైనా, ఎప్పుడైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు.

పక్కా ప్లాన్​తో..

గుంజపడుగు గ్రామంలో ఈనెల 17న జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కుంట శ్రీను తర్వాత దుబ్బపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యాడు. మంథని చౌరస్తాకు వచ్చేసరికి వామన్‌రావు దంపతులు కారులో మంథని కోర్టుకు వెళ్తుండడం కనిపించింది. వెంటనే బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. అతడు హత్య చేయడానికి కత్తులు, కారు, డ్రైవర్‌ చిరంజీవితో పాటు కోర్టు వద్ద రెక్కీకి లచ్చయ్య, కుమార్‌లను ఏర్పాటు చేశాడు.

రిమాండ్​కు బిట్టు శ్రీను..

మరోవైపు హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనును అర్ధరాత్రి మంథని అడిషనల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్‌ విధించారు. అతడిని కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. కరీంనగర్‌ కారాగారంలో ఉన్న కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌లను వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.

ఇదీ చూడండి: విశాఖ, హైదరాబాద్‌లో.. అదానీ డేటా కేంద్రాలు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.