
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నకిలీ పాస్పోర్టుల కేసులో 11 మంది ప్రధాన సూత్రదారులు ఉన్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఇద్దరు పోలీసులతో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఆధార్, ఇతర పత్రాలతో పాస్పోర్టులు పొందినట్లు గుర్తించామన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నకిలీ చిరునామాలు, పత్రాలతో 72 పాస్పోర్టులు తీసుకున్నారని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఒకే చిరునామా నుంచి 37 పాస్పోర్టులు తీసుకున్నారని తెలిపారు. పాస్పోర్ట్ కుంభకోణంపై శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన సైబరాబాద్ సీపీ.. వివరాలు వెల్లడించారు.
'ముగ్గురు ప్రయాణికుల పాస్పోర్టులు అనుమానాస్పదంగా ఉన్నాయి. వారు స్థానికులు కాకపోయినా.. వారివద్ద బోధన్ స్థానికతతో పాస్పోర్టులు ఉన్నాయి. వారు దుబాయ్ వెళ్లేందుకు యత్నించారు' అంటూ శంషాబాద్ విమానాశ్రయ అధికారుల నుంచి ఫిర్యాదు అందిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారని పేర్కొన్నారు.
ఆ దారే ఎందుకు..?
ఈ కేసులో ప్రధాన నిందితుడు పరిమళ్ బైన్ .. బంగ్లాదేశ్కి చెందినవాడని.. అక్రమంగా సముద్రమార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులు ఎస్సై మల్లేష్రావు, ఏఎస్సై అనిల్కుమార్, ముగ్గురు బంగ్లాదేశ్ దేశస్థులతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు పరిమళ్ బైన్ ఒక్కో పాస్పోర్టుకు రూ.10 వేలు నుంచి 30 వేలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. బంగ్లాదేశ్ నుంచి బోధన్ వచ్చి ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు వీరు ప్రయత్నాలు చేసినట్లు గుర్తించామన్నారు. భారత్ నుంచి ఎక్కువ వీసాలు పొందే అవకాశం ఉన్నందుకే ఈ దారి ఎంచుకున్నారని సీపీ చెప్పారు.
మిగిలిన వారెక్కడ..?
నకిలీ పత్రాలతో పాస్పోస్టులు పొందిన వారిలో మొత్తం 19 మంది వివిధ దేశాలకు వెళ్లినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. మిగిలిన 49 మంది ఎక్కడున్నారో గుర్తించాల్సి ఉందన్నారు. నకిలీ ఆధార్ కార్డులపై సంబంధిత విభాగానికి లేఖ రాశామన్నారు. పశ్చిమ బంగాలో పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకూ లేఖలు రాసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
పాస్పోర్టుల విషయంలో అప్పటి ఎస్సై మల్లేష్రావు, ఏఎస్సై అనిల్కుమార్.. సరిగా విచారణ చేయకుండా మంజూరుకు సిఫార్సు చేశారని సీపీ చెప్పారు. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీచూడండి: పాస్పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్